దృశ్యం-3కి నెంబర్‌ ప్లేట్‌ తలనొప్పి? అసలేంటీ వివాదం?

  • దృశ్యం 3పై ఫిర్యాదు
  • తన నంబర్ ప్లేట్ వాడారని ఆరోపణ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజీవ్
  • ఆర్‌సీ కాపీ సమర్పణ
  • సన్నివేశాలు తొలగించాలని డిమాండ్
  • న్యాయపోరాటానికి సిద్ధమని హెచ్చరిక
మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం 3’ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. చిత్రంలో చూపించిన ఓ వాహన నంబర్ ప్లేట్ తన కారుదేనని చెబుతూ ఇడుక్కి జిల్లాకు చెందిన రాజీవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

కుంచితన్నీ ప్రాంతానికి చెందిన రాజీవ్ తన ఫిర్యాదును మున్నార్ డీఎస్పీకి అందజేశాడు. సినిమాలో మోహన్‌లాల్ పాత్ర ఉపయోగించిన వాహనానికి తన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను అనుమతి లేకుండా వాడారని ఆరోపించాడు. దీనికి ఆధారంగా తన వాహనం ఆర్‌సీ కాపీని కూడా సమర్పించాడు. సినిమాలో కనిపించే అన్ని సన్నివేశాల నుంచి ఆ నంబర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశాడు. ఆ నంబర్ వల్ల భవిష్యత్తులో తనకు అనవసర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపాడు.

సినిమా గురించి చర్చ పెరగడంతో చాలా మంది తన వాహనాన్ని ‘దృశ్యం’ సినిమాలోని వాహనంగా గుర్తిస్తున్నారని రాజీవ్ చెప్పాడు. ముఖ్యంగా యువత ఎక్కువగా స్పందిస్తున్నారని వెల్లడించాడు. ఆసక్తికర విషయం ఏంటంటే రాజీవ్ దగ్గర ఉన్న వాహనం మహీంద్రా స్కార్పియో కాగా, సినిమాలో చూపించిన వాహనం మరో కంపెనీకి చెందినది. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రం తనదేనని ఆయన అంటున్నాడు.

సినిమా బృందం తనను ముందుగా సంప్రదించలేదని, అనుమతి కూడా తీసుకోలేదని రాజీవ్ ఆరోపించాడు. సమస్య పరిష్కారం కాకపోతే నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్, దర్శకుడు జీతూ జోసెఫ్‌తో పాటు సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.

Drishyam 3
Mohanlal
Jeethu Joseph
Drishyam 3 Controversy
Vehicle Number Plate Dispute
Antony Perumbavoor

More Telugu News